బడేభాయ్ – ఛోటేభాయ్ ముచ్చట తెలంగాణలో హాట్ టాపిక్ అయ్యింది. ఇది తెలంగాణ ఏక్నాథ్షిండే ఎపిసోడేనని బీఆర్ఎస్ అంటోంది. ప్రధాని మోదీని సీఎం రేవంత్ పెద్దన్న అనడంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మళ్లీ నరేంద్ర మోదీయే ప్రధాని అని రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిట రేవంత్.. ఏక్నాథ్ షిండే అవుతారని జోస్యం చెప్పారు కేటీఆర్. ప్రధాని కాబట్టే పెద్దన్న అని సంభోదించానన్నారు రేవంత్. మరోవైపు రేవంత్ రాజకీయ పరిణితి కనబరిచారని కమలనాథులు ప్రశంసిస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఆదిలాబాద్లో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన బడే భాయ్ వ్యాఖ్యలపై రగడ కొనసాగుతోంది. ప్రధాని పర్యటన ముగిసినా రాజకీయ రచ్చ కొనసాగుతోంది. మోదీని రేవంత్ బడే భాయ్ అనడంపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్- బీజేపీ మధ్య ఉన్న బంధం బయటపడిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
అయితే, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో రేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరించారని తెలంగాణ బీజేపీ నాయకుడు మురళీధర్ రావు చెప్పారు. పెద్దన్న అన్నంత మాత్రాన రెండు పార్టీలు కలిసిపోయినట్టేనా అని ప్రశ్నించారు టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. రేవంత్ అలా ఎందుకు అన్నారో ఆయన్నే అడగాలంటూ సూచించారు.
ప్రధాని కాబట్టే మోదీని పెద్దన్న అన్నానని, దీనిపై రచ్చ చేయాల్సిన అవసరం లేదని చిట్చాట్లో చెప్పారు సీఎం రేవంత్. రాష్ట్రంలో ప్రతిపక్ష నేత లేడన్న ఆయన ఐదు నెలల్లో తనను దించుతానడంపై స్పందించారు. తనను దించాలంటే కేసీఆర్ మోదీతో కలవాలన్నారు రేవంత్ రెడ్డి..😠