top of page
Suresh D

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌..

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. సీఎం నివాసంలో విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణం కేసులో ఇరుక్కుపోయారు. ఈ విషయం ముందస్తు బెయిట్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. కేజ్రీవాల్‌కు అరెస్ట్‌ నుంచి విముక్తి లేదని హైకోర్టు వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే అరవింద్ కేజ్రీవాల్‌ నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నారు. గురువారం సాయంత్రం ED బృందం సిఎం కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన తర్వాత అరెస్టు చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ ఇప్పటివరకు 9 సార్లు సమన్లు ​​పంపిన విషయం తెలిసిందే! ఈడీ బృందం 10వ సమన్లతో గురువారం సాయంత్రం కేజ్రీవాల్ ఇంటికి చేరుకుంది. సీఎం నివాసంలో రెండు గంటల పాటు విచారించారు. ఈ సమయంలో ఇడి జాయింట్ డైరెక్టర్ కపిల్ రాజ్ కూడా కేజ్రీవాల్ నివాసంలో ఉన్నారు. పీఎంఎల్‌ఏలోని సెక్షన్ 50 కింద కేజ్రీవాల్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్ర సీఎం కేజ్రీవాల్‌ను విచారించింది. పక్కా ఆధారాల ప్రకారం సీఎం ఇంట్లో సోదాలు జరిగాయి. కాగా, హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ న్యాయవాద బృందం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు ఢిల్లీ కేబినెట్‌ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ కూడా కేజ్రీవాల్‌ ఇంటి బయటికి చేరుకుని కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే సీబీఐ కేజ్రీవాల్‌ను విచారించింది. గతేడాది ఏప్రిల్‌లో 9 గంటల పాటు ప్రశ్నించారు. తాజాగా ఈడీ నమోదు చేసిన కేసులోనూ వరుసగా సమన్లు అందుతున్నాయి. ఇక ఇదే కేసులో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు.


bottom of page