top of page
MediaFx

ఈ కొత్త 'బాహుబలి' సంగతేంటి..?🎞️


'బాహుబలి' పేరు వినగానే మాహిష్మతి ఎలా అయితే ఊపిరి పీల్చుకుంటుందో? అలానే సగటు తెలుగు ప్రేక్షకుడి గుండె కూడా గర్వంతో ఉప్పొంగిపోతుంది. ఎందుకంటే ఈ బాహుబలితోనే తెలుగోడి సత్తా పాన్ ఇండియా లెవల్లో అందరికీ తెలిసింది.  అందుకే ఈ సినిమా అనగానే తెలుగు ఆడియన్స్‌కి పెద్ద ఎమోషన్. అలాంటిది డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సడెన్‌గా బాహుబలి గురించి తాజాగా ఓ సర్‌ప్రైజ్ ఇచ్చేశారు. దీంతో అసలు దాని కథేంటి? ఏం చూపించబోతున్నారో తెలీక ఆడియన్స్ బుర్ర పీక్కుంటున్నారు. 

"బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌" పేరుతో ఓ యానిమేటెడ్‌ సిరీస్‌ రాబోతున్నట్లు రాజమౌళి నిన్న ప్రకటించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ విడుదలవుతుందంటూ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన పోస్టులో "మాహిష్మతి ప్రజలు అతని పేరును మంత్రంలా జపిస్తుండగా, ఈ విశ్వంలోని ఏ శక్తి అతని రాకను ఆపలేదు" అంటూ రాజమౌళి రాశారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో బాహుబలి హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

చాలా మంది నెటిజన్లు ఇంది బాహుబలి 2కి కంటిన్యూ అయి ఉంటుందని పోస్టులు పెడుతున్నారు. మరికొంతమంది అసలు కంటిన్యూ చేయడానికి అక్కడ కథెక్కడుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే భల్లాలదేవుడ్ని మహేంద్ర బాహుబలి చంపేసి సింహాసనాన్ని అధిష్టించడంతో బాహుబలి 2 ముగిసింది. పైగా దానికి క్యాప్షన్ కూడా 'ది కన్‌క్లూజన్' అని ఇచ్చారు రాజమౌళి. దీన్ని బట్టి ఇక బాహుబలి కథ ఏముండదనే వాదన కూడా వినిపిస్తుంది.

అయితే గతంలో రాజమౌళి బాహుబలి 3 ఉంటుందా అనే ప్రశ్నకి ఓ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. "బాహుబలి 3 తీయాలనే ఆలోచన ప్రస్తుతానికి మాకు అయితే లేదు కానీ బాహుబలి సినిమాని వివిధ రూపాల్లో తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది" అంటూ చెప్పారు. అందులో భాగంగానే మాహిష్మతి సామ్రాజ్యానికి సంబంధించిన ఆసక్తికర విషయాలతో ఆనంద్‌ నీలకంఠన్‌ 'ది రైజ్‌ ఆఫ్‌ శివగామి' అంటూ ఓ పుస్తకం కూడా రాశారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగానే యానిమేటెడ్‌ సిరీస్‌ తీస్తున్నారంటూ మరికొంతమంది ఊహిస్తున్నారు. ఇందులో బాహుబలిలోని ఆ పాత్రలతోనే సినిమాలో చూపించని కథను చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే సినిమాలో ఎడిటింగ్‌లో తీసేసిన సీన్లు, మూల కథలో ఉన్న సన్నివేశాలను బేస్ చేసుకొని ఈ యానిమేటెడ్ సిరీస్ తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి జక్కన్న బుర్రలో ఏం ప్లాన్ ఉందో చూడాలి.



bottom of page