top of page
MediaFx

తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ హెచ్చరిక 🌧️

మొన్నటి వరకు విపరీతమైన ఎండలు. ఆ వేసవి తాపానికి జనాలంతా ఎలా అల్లాడిపోయారో మనం చూశాం. ఇప్పుడిప్పుడే మెల్లగా వర్షాలు మొదలయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని  వాతావరణ శాఖ వెల్లడించింది రెమాల్ తుఫాన్ వల్ల ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.

నాగర్‌కర్నూలు జిల్లాలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. దాంతో నాగర్‌కర్నూలు జిల్లాలోనే ఏడుగురు మృతి చెందారు. తాడూరు శివారులో రేకుల షెడ్డు కూలి నలుగురు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు పిడుగుపాటుకు గురయ్యారు. మరొకరు ఈదురుగాలులకు ఇటుక రాయి కారుపై ఎగిరిపడడంతో అద్దం గుచ్చుకొని చనిపోయారు. వికారాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ప్రజల్ని భయపెట్టింది. గాలి దుమారానికి ఇంటిపైనున్న రేకులు కొట్టుకుపోయాయి. ధారూర్ మండలంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

అటు, రెమాల్‌ తీవ్ర తుఫాన్‌ ప్రభావం ఏపీపై పెద్దగా లేనప్పటికీ పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దాంతో శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోని రేకుల షెడ్డుల కింద ఉన్న భక్తులు పరుగులు తీశారు. ఇంకా, తుఫాన్‌ ఎఫెక్ట్‌తో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో అలలు భయపెడుతున్నాయి. సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. వాహనదారులను కెరటాలు ముంచెత్తుతుండడంతో బీచ్ రోడ్డులో రాకపోకలు నిలిపివేశారు. వాతావరణ శాఖ మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది.

bottom of page