top of page
MediaFx

బంగాళాఖాతంలో అల్పపీడనం.. మూడు రోజుల పాటు వర్షాలు!


నైరుతి బంగాళాఖాతంలో బుధవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలో ఏర్పడినట్లు భారత వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. ఈ అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. శనివారం సాయంత్రానికి తుపానుగా బలపడి ఈశాన్య, వాయవ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశముందని తెలిపింది. మధ్య బంగాళాఖాతం నుంచి దారి మళ్లి బంగ్లాదేశ్‌ వైపు కదిలే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై నామమాత్రంగానే ఉండనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ బుధవారం రాత్రి పేర్కొంది. వాయుగుండం తుపానుగా బలపడితే దీనికి ఒమన్‌ సూచించిన ‘రెమాల్‌’ అనే పేరును పెట్టనున్నారు. అల్పపీడనం, వాయుగుండాల ప్రభావంతో రానున్న ఐదు రోజులు కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఈ అల్పపీడనం ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా విస్తరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అండమాన్, నీకో బార్ దీవులతోపాటు దక్షిణ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. అల్పపీడనం నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారనుంది. దీంతో ఆదివారం వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

bottom of page