top of page

భేటీకి సిద్దమైన ఇరు రాష్ట్రాల సీఎంలు.. సీపీఐ నారాయణ సలహా ఇదే..


రాష్ట్ర ప్రయోజనాల కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోని సానుకూలంగా చర్చించుకోవాలన్నారు సీపీఐ నేత నారాయణ. ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవాల్సిన పనిలేదన్నారు. జూలై 6న హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. ఇది ఒక శుభదినం అని అభివర్ణించారు. ఈ కీలక సమావేశం నేపథ్యంలో సీపీఐ నేత నారాయణ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు మాట్లాడే ప్రజల క్షేమం కోరాలన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏ రాష్ట్రానికి రావల్సిన ప్రయోజనాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఏ రాష్ట్రం హక్కులను వారు కాపాడుకుంటూనే సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. పోలవరం, నీటి తగాదాలపై కూడా స్పందించారు. భద్రాచలంలో ముంపు ప్రాంతాలకు సంబంధించిన అంశాలను కూడా సున్నితంగా చర్చించి పరిష్కరించుకోవాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ నీటి సమస్యలు ఉండేవని, అయితే అవి అంతర్గతంగా ఉండేవని గుర్తు చేశారు. అయితే మారిన రాజకీయ, ప్రాంతీయ పరిస్థితుల దృష్ట్యా బహిర్గతం అయిందన్నారు. తెలంగాణ, ఆంధ్రా భౌగోళికంగానే విడిపోయిందన్నారు. అయితే తెలుగు మాట్లాడే వారు కలిసే ఉన్నట్లు చెప్పారు. ఒకప్పుడు సెంటిమెంట్ పనిచేసిందని, కానీ సెంటిమెంట్ ఎల్లవేళలా పనిచేయదు, ఉండాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఇది తాత్కాలికమే తప్ప శాశ్వత రాజకీయ పరిష్కారం కాదని చెప్పారు. పరిష్కారం అవ్వని విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒత్తిడి తీసుకురావాలన్నారు. అప్పుడే సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ భేటీ గురించి ఒక్కొక్కరు ఒక్కోరకంగా మాట్లాడుకుంటారని వాటిని పట్టించుకోనవసరం లేదని అన్నారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page