బీఆర్ఎస్కు మంచి పట్టు ఉన్న సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు అధిష్టానం ఫోకస్ పెట్టింది. గత పదేళ్లుగా ఇక్కడ బీఆర్ఎస్ వరుసగా విజయాలు సాధిస్తూ బలోపేతం అయ్యింది. అంతేకాకుండా ఇక్కడి నుంచే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఆయన సొంత సెగ్మెంట్పైనే దెబ్బకొడితే.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్లో ఉన్న విభేదాలను తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల పదహారు మంది కౌన్సిలర్లు క్యాంపుకి వెళ్ళారు. అయితే వారిని ఒప్పించి మళ్ళీ సిరిసిల్లకు తీసుకువచ్చారు కొంతమంది బీఆర్ఎస్ నేతలు. కానీ సిరిసిల్ల మున్సిపాలిటీలో అవిశ్వాసం భయం ఇంకా వీడలేదు. దీని వెనక కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన పొన్నం ప్రభాకర్కు ఈ సెగ్మెంట్ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ముందుగా సెకండ్ క్యాడర్ నేతలను కాంగ్రెస్ కండువా కప్పించే ప్రయత్నం చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ సమక్షంలో ముస్తాబాద్ జడ్పీటీసీతో పాటుగా పలువురు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మిగతా మండలాలకు సంబంధించిన నేతలతో కూడా పొన్నం సమావేశం నిర్వహిస్తున్నారు. 🌐👥