top of page
MediaFx

వారణాసిలో మోదీపై కమేడియన్ పోటీ.. ఒకప్పటి ప్రధాని వీరాభిమానికి ఈసీ ఝలక్

ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ వీడియోలు చేస్తూ గుర్తింపు పొందిన యూట్యూబర్, కమెడియన్ శ్యామ్ రంగీలాకు ఎన్నికల కమిషన్ ఝలక్ ఇచ్చింది. వారణాసిలో మోదీపై పోటీకి సిద్ధమైన శ్యామ్ రంగీలా.. మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే, కమేడియన్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించింది. ఈ స్థానంలో మొత్తం 55 మంది నామినేషన్లు దాఖలు కాగా.. వివిధ కారణాలతో 36 నామినేషన్లను చెల్లనవిగా నిర్దారించారు. ప్రస్తుతం ప్రధాని మోదీ, కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ సహా 15 మంది బరిలో ఉన్నారు.నామినేషన్ దాఖలకు ప్రయత్నిస్తే జిల్లా యంత్రాంగం తనను అనుమతించ లేదని ఆరోపిస్తూ ఈ మేరకు సోషల్ మీడియా 'ఎక్స్'లో శ్యామ్ రంగీలా పోస్ట్ పెట్టారు. మే 10న వారణాసిలో నామినేషన్ వేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాయమని, మంగళవారం కూడా తనను కలెక్టర్ ఆఫీసులోకి అనుమతించలేదని ఆరోపించాడు.

‘ఈ రోజు జిల్లా మేజిస్ట్రేట్ నా పత్రాలలో కొంత సమస్య ఉందని.. నేను ప్రమాణం చేయలేనని చెప్పారు. నాతో పాటు లాయర్లను లోపలికి రానివ్వలేదు.. నన్ను ఒంటరిగా పిలిచారు. నా స్నేహితుడ్ని కొట్టారు. మోదీజీ ఏడుపు నటించవచ్చు.. కానీ ఇక్కడ ఏడ్వడం నాకు ఇష్టం లేదు.. 27 మంది ముందు రోజు నామినేషన్ వేస్తే.. ఈ రోజు 32 నామినేషన్లు తిరస్కరించారు.. ఎన్నికల కమిషన్‌ను చూసి నవ్వాలనిపిస్తోంది.. నేను నవ్వాలా? ఏడవాలా? అని’ రంగీలా దుయ్యబట్టారు.

ఈ ఆరోపణలపై వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం తన అధికారిక ట్విట్టర్‌లో స్పందించింది. రంగీలా అఫిడ్‌విట్‌లో కొన్ని లోపాలు ఉన్నాయని, నిబంధనలను పాటించలేదని పేర్కొంది. ‘మీ సమక్షంలోనే మీ నామినేషన్ పత్రాన్ని పరిశీలించారు.. లోపాల గురించి మీకు తెలియజేశఆం... మీరు సమర్పించిన అఫిడవిట్ అసంపూర్తిగా ఉన్నందున మీ నామినేషన్ పత్రం తిరస్కరించాం.. మీరు ప్రమాణం చేయలేదు.. దాని ఆర్డర్ కాపీ కూడా మీకు అందుబాటులో ఉంచాం’ అని కలెక్టర్ ఎస్ రాజలింగం ఎక్స్‌లో తెలిపారు.రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌‌కు చెందిన 29 ఏళ్ల శ్యామ్ రంగీలా మిమిక్రీ ముఖ్యంగా రాజకీయ నాయకులను అనుకరించడంలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’ అనే టీవీ షోతో పాపులర్ అయ్యాడు. తొలినాళ్లలో మోదీకి వీరాభిమాని అయిన శ్యామ్.. కొద్ది కాలంగా ఆయన విధానాలపై విమర్శకుడిగా మారాడు. వారణాసి నుంచి మోదీపై తాను పోటీ చేయనున్నట్టు ప్రకటించాడు.

‘2014లో నేను మోదీ అనుచరుడ్ని. ఆయనకు మద్దతుగా.. రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా నేను చాలా వీడియోలు చేశాను.. వాటిని చూస్తే రాబోయే 70 ఏళ్లు నేను బీజేపీకి ఓటు వేస్తానని చెప్పొచ్చు. కానీ గత పదేళ్లలో పరిస్థితి మారింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానిపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను’ అని వీడియోను షేర్ చేశాడు.


bottom of page