పార్లమెంట్ ఎన్నికల వేళ ఛత్తీస్గఢ్లోని బస్తర్ అడవుల్లో రక్తం ఏరులై పారింది. పచ్చని అడవులు ఎర్రని రక్తంతో ఎరుపెక్కాయి.
బస్తర్ రీజియన్లోని కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య మంగళవారం మధ్యాహ్నం జరిగిన భారీ ఎన్కౌంటర్లో దాదాపు40 మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. ఇప్పటి వరకూ 29 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక భద్రతా దళాలకు చెందిన ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. మృతుల్లో ఇప్పటివరకు ముగ్గురిని గుర్తించారు. వారిలో ఇద్దరు తెలంగాణకు చెందిన వారిగా పోలీసులు చెబుతున్నారు. మృతుల్లో మరికొందరు తెలంగాణ వాసులు ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కాగా మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కానుండగా ఆ రాష్ట్రంలో అతిపెద్ద ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ ఏడాదిలో 4 నెలల వ్యవధిలో వేర్వేరు ఎన్కౌంటర్లలో 79 మంది మావోలు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సుగులూరి చిన్నన్న అలియాస్ విజయ్, అలియాస్ శంకర్రావు ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు.