వన్య ప్రాణులను కాపాడటం కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. చిరుత పులుల జాతి అంతరించిపోకుండా పరిరక్షించేందుకు అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ, సత్ఫలితాలు కనిపించడం లేదు. మధ్యప్రదేశ్ లోని కునో నేసనల్ పార్క్ లో(Kuno national park)శుక్రవారం మరో చీతా మరణించింది.
సూరజ్ అనే మగ చీతా(Cheetah suraj died) మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. గత ఐదు నెలల వ్యవధిలో మృతి చెందిన చీతాలలో ఇది ఎనిమిదవది. దీని మరణానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. నేషనల్ పార్క్ లో శుక్రవారం ఉదయం పెట్రోలింగ్ అండ్ మానిటరింగ్ టీమ్ కు ఈ చీతా పూర్తిగా బలహీనంగా, పడిపోయిన స్థితిలో కనిపించింది. వీరు వెంటనే డాక్టర్లకు సమాచారం ఇచ్చారు. అయితే డాక్టర్లు వచ్చేలోపే ఆ చీతా మరణించింది. దాని బరువు కూడా భారీగా తగ్గింది. ఫిబ్రవరిలో దాదాపు 55 కేజీలు ఉన్న ఆ చీతా ఇప్పుడు 43 కేజీలకు తగ్గిందని తెలిపారు. కాగా,మొత్తంగా ఈ నెలలోనే రెండు చీతాలు చనిపోయాయి. మంగళవారమే తేజ అనే మగ చీతా గాయాలతో మరణించిన విషయం తెలిసిందే. సంభోగ సమయంలో అయిన గాయాల కారణంగానే అది మృతి చెందినట్టు తర్వాత నిర్ధారించారు. కాగా, ప్రాజెక్టు చీతాలో భాగంగా భారత్ గత ఏడాది సెప్టెంబర్ 17న నమీబియా నుంచి ఎనిమిది, ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను కునో జాతీయ పార్కుకు తీసుకువచ్చారు. ఇందులో ఐదు మృతి చెందగా నాలుగు ఎన్క్లోజర్లో ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో నాలుగు చీతా పిల్లలు పుట్టాయి, అయితే వాటిలో మూడు మేలో ఒకే రోజు మరణించాయి. ప్రస్తుతం కునో నేషనల్ పార్క్ లో 16 చీతాలు మాత్రమే ఉన్నాయి. పుట్టిన చిరుతల్లో 90 శాతం వరకు తక్కువ వయసులోనే మరణిస్తాయని నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ, అభయారణ్యంలో పరిరక్షణలో ఉన్న చిరుత పులులు వరుసగా మరణిస్తుండటం అత్యంత విషాదకరం. 😥
Comments