top of page
MediaFx

చంద్రబాబు రాకతో అమరావతికి కొత్త కళ..


ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ మహోత్సవం జూన్ 12న ఉదయం 11.27 కు జరగనుంది. జూన్ 9న ఢిల్లీలో ప్రధాన మంత్రి మోదీ, పలువురు కేంద్ర మంత్రుల ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు, ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అమరావతికి చేరుకోనున్నారు.

అక్కడి నుంచి నేరుగా ఉండవల్లిలోని తన నివాసంలో బస చేయనున్నారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ దగ్గరుండి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ఈ మహోత్సవానికి ప్రధానమంత్రి మోదీతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వీవీఐపీలు హాజరుకానున్నారు. ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు చేత గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. జూన్ 11 రాత్రికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.

మునుపటి కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా తుళ్లూరు, తాడేపల్లి, ఉండవల్లి, గన్నవరం ప్రాంతాలలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మించారు. కానీ గత ఐదేళ్లలో అభివృద్ధి జరగక, పిచ్చి మొక్కలు పెరిగాయి. ప్రస్తుతం, ఈ ప్రాంతాన్ని పునరుద్ధరించేందుకు అధికారుల శ్రమ కొనసాగుతోంది.

CRDA అధికారులు, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పర్యవేక్షణలో, అడవిలా మారిన ప్రాంతాలను తొలగిస్తున్నారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం తర్వాత నిర్మాణ పనులపై దిశా నిర్దేశం చేస్తున్నారు. అమరావతి రైతులకు రావలసిన కౌలు నగదుపై ఫైనాన్స్ డిపార్ట్మెంట్‎తో మాట్లాడి క్లియర్ చేస్తామని తెలిపారు. అలాగే గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టాలని సూచించారు.


bottom of page