top of page
MediaFx

‘సీఏ పరీక్షల తేదీలను మార్చలేం..

దేశవ్యాప్తంగా మే నెలలో నిర్వహించనున్న ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ (సీఏ) ఇంటర్‌ ఫైనల్ పరీక్షల షెడ్యూల్‌ మార్పు కోరుతూ అభ్యర్ధులు దాఖలు చేసిన చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం (ఏప్రిల్‌ 8) తోసిపుచ్చింది. దీంతో గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారంగానే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు చేస్తోంది.

సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మే నెలలో జరగాల్సిన పరీక్షలను జూన్‌కు వాయిదా వేయాలని కోరుతూ 27 మంది విద్యార్థులు చేసిన విజ్ఞప్తిని జస్టిస్ సి హరి శంకర్ తిరస్కరించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో పరీక్షలు నిర్వహించడంపై చట్టపరమైన నిషేధం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. సీఏ పరీక్షలను రీషెడ్యూల్ చేయడానికి సరైన కారణం ఉందా అంటూ ప్రశ్నించింది. 4.26 లక్షల మంది విద్యార్థులు రాస్తున్న సీఏ ఇంటర్‌, ఫైనల్‌ పరీక్షలను కేవలం కొద్ది మంది అభ్యర్థన కోసం మార్చలేమని స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రకటించిన సీఏ పరీక్షల తేదీలకు లోక్‌ సభ ఎన్నికల వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని, పరీక్షల తర్వాత విద్యార్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని, ప్రస్తుతానికి పరీక్షలపై దృష్టి పెట్టాలని కోర్టు పేర్కొంది.

ఏపీ పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి.. ఫలితాలు ఎప్పుడంటే

ఆంధ్రప్రదేశ్‌ పదోతరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది. ఈ మేరకు మూల్యాంకన ప్రక్రియ పూర్తయినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు దేవానందరెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. తదుపరి ప్రాసెస్‌కు రెండు వారాల సమయం పడుతుందని, ఫలితాలు మే మొదటివారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

ఈ నెల 13న జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్టులకు రాత పరీక్ష

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు చెందిన అభ్యర్ధులకు ఏప్రిల్ 13వ తేదీన జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు తెలిపారు. ఈ ప్రకటన కింద మొత్తం 39 జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏప్రిల్‌ 13వ తేదీన తిరుపతిలోని జూపార్క్‌ రోడ్డులో ఉన్న ఐయాన్‌ డిజిటల్‌ జోన్‌లో ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని, అభ్యర్ధులు గమనించాలని సూచించారు.

Comments


bottom of page