గేట్లు తెరుస్తాం ఖబర్దార్ అన్న సీఎం రేవంత్రెడ్డి… అన్నట్లుగానే చిన్న గేట్లు కాదు భారీ గేట్లే తెరిచి వలసలను ఓ రేంజ్లో ఎంకరేజ్ చేస్తున్నారు. దీంతో గులాబీ పార్టీ నేతలు కాంగ్రెస్ లోకి గుంపులుగా వెళ్లిపోతున్నారు. చిన్నా పెద్దా, సీనియర్, జూనియర్ అన్న తేడా లేకుండా ఆపరేషన్ ఆకర్ష్తో లీడర్లందరికి షేక్ హ్యాండిస్తోంది తెలంగాణ కాంగ్రెస్. మీ భవిష్యత్తుకు మా భరోసా అంటూ వచ్చిన వారికి వచ్చినట్లు కండువా కప్పేస్తోంది. దీంతో బీఆర్ఎస్ కాస్త కళ తప్పింది. ఆరు నెలల క్రితం వరకు ఫుల్ టైట్గా ఉన్న కారు.. జంపింగులతో కొంత ఖాళీగా కనిపిస్తోంది. ఇదంతా సీఎం రేవంత్ వ్యూహాత్మకంగానే చేస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ను దెబ్బకొట్టేందుకు చూస్తున్నారంటున్నారు విశ్లేషకులు. అంతేకాదు రాష్ట్రం ఏర్పడ్డాక పూర్తిగా ఉనికి కోల్పోయిన టీ-టీడీపీలా బీఆర్ఎస్ను చేయాలని చూస్తున్నారన్న చర్చ ఊపందుకుంది.
కాంగ్రెస్ పార్టీలో లీడర్ల చేరికల సంగతి అలా ఉంటే… కేసీఆర్ బలంగా నమ్మిన వ్యక్తులు , వెన్నంటే ఉన్న నేతలు, కుటుంబ సభ్యుల హోదా తీసుకున్న నాయకులు సైతం కాంగ్రెస్కు క్యూ కట్టడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కేసీఆర్ మాటే శిరోధార్యమనుకునే కీలక నేతలు కడియం, కేకే, బొంతు రామ్మోహన్ లాంటి చాలా మంది నాయకులు బీఆర్ఎస్కు బై చెప్పడం వెనుక రేవంత్ వ్యూహాలున్నట్లు చర్చ జరుగుతోంది. రేవంత్ టార్గెట్ కేవలం బీఆర్ఎస్ను ఖాళీ చేయడమే కాదు… వెన్నంటే ఉంటూ మంచిచెడు మాట్లాడుకునే సాన్నిహిత్యం ఉన్న వాళ్లను సైతం పార్టీలోకి చేర్చుకుని కేసీఆర్ను మానసికంగానూ కుంగదీడమే రేవంత్ లక్ష్యమన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ గతంలో మాట్లాడిన మాటలను తెరపైకి తీసుకొస్తున్నారు
బీఆర్ఎస్ను బొంద పెడతామంటూ… సీఎం కాకముందు ఎన్నో సార్లు డైలాగులు పేల్చారు రేవంత్. అయితే సీఎం అయ్యాక అలాంటివేం ఉండవనుకునే లోపే… దావోస్నూ సేమ్ డైలాగులు రిపీట్ చేశారు. బీఆర్ఎస్ను తొక్కేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి అనుగుణంగానే రేవంత్ అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది.
మొత్తంగా… బీఆర్ఎస్తో పాటు కేసీఆర్ టార్గెట్గా రేవంత్ పాలిటిక్స్ నడుస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి రేవంత్ వ్యూహాలకు కేసీఆర్ ఎలా చెక్ పెడతారు…? గులాబీ పార్టీకి పూర్వవైభవం ఎలా తీసుకొస్తారన్నది ఆసక్తికరంగా మారింది.