భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) చరిత్రలో మొదటిసారిగా పార్లమెంటులో స్థానం కోల్పోయింది. పార్టీ మొదలు పెట్టినప్పటి నుంచి పార్లమెంటులో ఒక్క స్థానంతో అయినా ప్రభావాన్ని చాటుతూ వచ్చింది. స్వయంగా కేసీఆర్ కూడా బీఆర్ఎస్ నుంచి ఎంపీగానే 2014 వరకు గెలుపొందారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి కారణమేంటి?
రాజకీయ సమీకరణాలతోనే తెలంగాణ సాధ్యమని నమ్మిన కేసీఆర్.. ఉద్యమంతో పాటు ఎన్నికలతో తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేశారు. 2001లో పార్టీ ప్రారంభించిన సమయంలో కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్లీ అక్కడి నుంచే గెలుపొందారు. 2004లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేసిన టీఆర్ఎస్ ఐదు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. 2009లో టిడిపితో కలిసి మహాకూటమిలో భాగస్వామిగా బరిలో ఉండి రెండు స్థానాలు గెలుచుకుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సింగిల్గా పోటీ చేసిన కారు పార్టీ 11 స్థానాల్లో విజయం సాధించింది. 2019లో రెండు స్థానాలను కోల్పోయి తొమ్మిది ఎంపీ సీట్లను గెలిచింది. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్కు ఒక సీటు కూడా దక్కలేదు.
మల్కాజ్గిరిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఏడుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా అక్కడ మూడో స్థానానికి పార్టీ పరిమితం అవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కేవలం సీట్ల పరంగానే కాదు ఓట్ల పర్సంటేజ్ చూసిన అలాగే ఉంది. 2019 పార్లమెంట్ ఎలక్షన్లో 41.29 శాతం ఓట్లు వస్తే.. తాజాగా 16.68 శాతానికి గులాబీ పార్టీ ఓట్లు పడిపోయాయి. ఇంత దారుణ పరాభవానికి కారణాలను అన్వేషిస్తుంది బీఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేడర్ అంతా నిరుత్సాహంలో ఉండడం.. ఎంతో కొంత కేసిఆర్ బస్సు యాత్ర ప్రభావాన్ని చూపినా.. అది ఓట్ల రూపంలో మారకపోవడం కొంత నిరుత్సాహాన్ని కలిగిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలి అనే విషయంలో ఓటర్లు కన్విన్స్ కాకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది.