top of page

బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సతీమణి కారు ఎత్తుకెళ్లిన దొంగలు


బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా భార్య మల్లికా నడ్డా కారును దుండగులు ఎత్తుకెళ్లారు. అయితే ఈ కారు దొంగతనం ఈ నెల 19 వ తేదీన జరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని గోవిందపురి ప్రాంతంలో ఈ కారు దొంగతనానికి గురైనట్లు కారు డ్రైవర్ వెల్లడించాడు. కారు చోరీ అయిన తర్వాత వెతికిన డ్రైవర్.. ఎంతకూ కనిపించకపోవడంతో ఆ విషయాన్ని నడ్డా భార్యకు చెప్పాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. కారును వెతికే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఆ కారు చోరీకి గురైన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ నెల 19 వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో మల్లికా నడ్డా కారు దొంగతనానికి గురైంది. మల్లికా నడ్డాకు చెందిన టయోటా ఫార్చునర్ కారును డ్రైవర్ జోగిందర్.. సర్వీసింగ్‌కు తీసుకెళ్లాడు. అయితే సర్వీసింగ్ పూర్తి చేసుకుని.. తిరిగి నడ్డా ఇంటికి చేరుకునే సమయంలో దారి మధ్యలో తన ఇల్లు ఉండటంతో అక్కడ కారును నిలిపి ఉంచి ఇంట్లోకి వెళ్లాడు. భోజనం చేసి బయటికి వచ్చి చూసేసరికి ఆ కారు కనిపించలేదు. ఆ ప్రాంతంలో కారు కోసం తిరిగినా ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కారును వెతికేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

bottom of page