top of page
MediaFx

బీహార్‌ మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ కన్నుమూత..


బీహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత సుశీల్‌ కుమార్‌ మోదీ (72) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించి సోమవారం (మే 13) రాత్రి న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుది శ్వాస విడిచారు. ఈ మేరకు సుశీల్‌ కుమార్‌ మోదీ మరణ వార్తను బీజేపీ అధికారికంగా ధృవీకరించింది. ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతూ పార్టీ రాష్ట్ర యూనిట్ అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఆయన మరణం బీహార్‌తో పాటు బీజేపీ కుటుంబానికి తీరని లోటని పోస్టులో పేర్కొంది. ఆయన అకాల మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర విచారం వ్యక్తం చేశారు. సుశీల్‌ మోదీ మృతి రాష్ట్రానికి తీరని లోటని ఆయనకి అత్యంత సన్నిహితుడైన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. కాగా సుశీల్ కుమార్ మోడీ బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ రాజ్యసభ ఎంపీగా సేవలు అందించారు. బీహార్‌ రాజకీయాల్లో చురుగ్గా ఉండే సుశీల్ కుమార్ మోడీ గత కొంత కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఆయన ఆరోగ్యం సహకరించక పోవడంతో లోక్‌సభ ఎన్నికలకు సైతం దూరంగా ఉన్నారు. ఈ రోజు (మంగళవారం) పాట్నాలోని ఆయన నివాసంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. సుశీల్ కుమార్ మోదీ రాజ్యసభ ఎంపీగా ఒకసారి, రాష్ట్రమంత్రిగా రెండు సార్లు కొనసాగారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


bottom of page