top of page
MediaFx

ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..


జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నటిస్తోన్న సినిమా కావడంతో దేవరపై అభిమానుల అంచనాల భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకు రిలీజైన సినిమా పోస్టర్లు, గ్లింప్స్ ఫ్యాన్స్ కు థ్రిల్ ఇచ్చాయి. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్‌ వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఫారెస్ట్ రీజియన్‌ లో దేవరకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ లో అపశ్రుతి జరిగింది. షూటింగ్‌ జరుగుతున్న సమయంలో జూనియర్‌ ఆర్టిస్టులపై తేనెటీగలు దాడి చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో షూటింగ్‌ స్పాట్‌లో ఉన్న సుమారు 20 మందికి పైగా గాయాలు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వారందరూ కూడా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని సమాచారం.

ఇదిలా ఉంటే ప్రమాదం జరిగిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌ లేరు. ఆయన ప్రస్తుతం ‘వార్‌2’ సినిమా షూటింగ్ లో బిజిబిజీగా ఉంటున్నారు. విశాఖపట్నంలో మొదట ఎన్టీఆర్ పాల్గొనని సన్నివేశాలను షూట్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే తేనెటీగల దాడి జరిగిందని సమాచారం. అయితే దీనికి సంబంధించి చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దేవర సినిమాలో జాన్వీ కపూర్ తో మరో మలయాళ భామ సెకెండ్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ప్రకాష్‌ రాజ్, శ్రీకాంత్, నరైన్, టామ్‌ షైన్‌ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా అడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మొదటి పార్ట్ దసరా కానుకగా అక్టోబర్ 10న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

bottom of page