top of page
MediaFx

‘బాహుబలి సినిమా నన్ను రోడ్డున పడేసింది’..


జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో ధనరాజ్ ఒకరు. తన డైలాగులు, ప్రాసలు, పంచులకు చాలా మంది అభిమానులు ఉన్నారు. అందుకే జబర్దస్త్ లో సాధారణ కంటెస్టెంట్స్ నుంచి ‘ధనాధన్ ధనరాజ్’ అంటూ టీమ్ లీడర్ దాకా ఎదిగాడు. ఇలా బుల్లితెరపై నవ్విస్తూనే సిల్వర్ స్క్రీన్ పైనా సత్తా చాటాడీ కమెడియన్. కాగా కేవలం నటుడు, కమెడియనే గానే కాకుండా మంచి దర్శకుడిగా కూడా ఎదగాలనుకుంటున్నాడు ధనరాజ్. అందుకే సముద్ర ఖని తో కలిసి ‘రామ రాఘవం’ పేరుతో ఓ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు . ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. ఇదిలా ఉంటే గతంలో నిర్మాతగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు ధన రాజ్. తనే హీరోగా ‘ధనలక్ష్మి తలుపు తడితే’ అనే సినిమాను నిర్మించాడు. బుల్లితెర రాములమ్మ శ్రీముఖి ఇందులో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా వల్ల తాను సంపాదించినంతా పోగొట్టుకుని రోడ్డున పడ్డానంటున్నాడు ధన రాజ్. అయితే ఇందుకు కారణం తన సినిమా బాగోలేక కాదని, బాహుబలి సినిమా వల్ల తాను బాగా నష్టపోయానంటున్నాడీ కమెడియన్ కమ్ డైరెక్టర్. ‘నా సినిమా చూసిన వారందరూ చాలా బాగుందన్నారు. సినిమా రిలీజ్ సమయంలో నేను ఒక సినిమా షూటింగ్ నిమిత్తం రాజస్థాన్ లో ఉన్నాను. అప్పుడు శ్రీముఖి ఫోన్ చేసి థియేటర్స్ లో టికెట్స్ దొరకడం లేదని చెప్పింది. ఆ వార్త విని చాలా సంతోషం అనిపించింది. అయితే మా దురదృష్టం.. ఆ తర్వాతి ప్రభాస్ బాహుబలి సినిమా థియేటర్లలోకి అడుగుపెట్టింది. ముందస్తుగానే అగ్రిమెంట్ ఉండడంతో నా సినిమాను వారానికే లేపేశారు. దీంతో నాకు భారీ నష్టాలు వచ్చాయి. నా డబ్బుతో పాటు స్నేహితుల దగ్గర అప్పులు చేసి మరీ సినిమాను పూర్తి చేశాను. ఆ సమయంలో సర్వసం కోల్పోయినట్లనిపించింది. నా భార్య కూడా నన్ను తిట్టింది’ అని అప్పటి గడ్డు పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు ధన రాజ్. ప్రస్తుతం అతని వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

bottom of page