top of page
Suresh D

అసదుద్దీన్ ఒవైసీ నివాసం వద్ద ఇజ్రాయేల్ అనుకూల పోస్టర్లు కలకలం..?


ఢిల్లీలోని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ నివాసం వద్ద కలకలం రేగింది. గురువారం ఆయన ఇంటి గోడలపై గుర్తుతెలియని వ్యక్తులు ఇజ్రాయేల్‌ అనుకూల పోస్టర్లు అతికించి, నేమ్ ప్లేట్‌పై నల్ల ఇంకును పోశారు. ఇటీవల ఎంపీగా ప్రమాణం చేసిన సమయంలో ‘జై పాలస్తీనా’ అంటూ అసదుద్దీన్ ఒవైసీ లోక్‌సభలో నినదించారు. ఇది జరిగిన రెండు రోజులకే ఆయన నివాసం వద్ద ఇజ్రాయేల్‌ అనుకూల పోస్టర్లు అతికించడం గమనార్హం. సెంట్రల్ ఢిల్లీలోని 34 అశోకా రోడ్డులో ఉన్న హైదరాబాద్ ఎంపీ ఒవైసీ ఇంటికి గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి.. గేట్లతోపాటు గోడలకు పోస్టర్లు అతికించారు. అనంతరం ఎంపీ ఇంటి నేమ్ బోర్డుపై నల్ల సిరా చల్లారు.

‘భారత్‌ మాతా కీ జై, ఐ స్టాండ్‌ విత్‌ ఇజ్రాయెల్, జై శ్రీరాం.. ఒవైసీని సస్పెండ్ చేయాలి’ అని అతికించిన ఆ పోస్టర్లలో రాశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు, దీనిపై స్పందించిన పోలీసులు.. తక్షణమే అక్కడకు చేరుకుని పోస్టర్లను తొలగించారు. పోలీసుల చేరుకునేసరికి ఆందోళనకారులు అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

మరోవైపు, దీనిపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్‌ (ఎక్స్).లో స్పందించారు. ‘గుర్తుతెలియని దుండగులు మా నివాసం వద్ద దుశ్చర్యకు పాల్పడ్డారు... ఇజ్రాయేల్ అనుకూల పోస్టర్లు అంటించి, నల్ల సిరా పోశారు. ఢిల్లీలోని నా నివాసం ఎన్నిసార్లు దాడులు చేశారో తెలియదు.. తరుచూ నన్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు.. ఇలాంటి సంఘటనలను ఢిల్లీ పోలీసులు నిరోధించలేకపోయారని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ట్విట్టర్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ట్యాగ్ చేస్తూ.. ఆయన పర్యవేక్షణలోనే ఈ సంఘటనలు జరిగాయని ఆరోపించారు.

‘‘ఇది ఎలా జరుగుతోందని నేను ఢిల్లీపోలీసు అధికారులను అడిగితే వారు నిస్సహాయత వ్యక్తం చేశారు... కేంద్ర మంత్రి అమిత్‌షా మీ పర్యవేక్షణలోనే ఇది జరుగుతోంది. స్పీకర్ ఓం బిర్లా దయచేసి ఎంపీల భద్రతకు హామీ ఇస్తారో లేదో మాకు చెప్పండి’ ఒవైసీ ప్రశ్నించారు.

వైరల్ అవుతోన్న వీడియోలో ఇజ్రాయేల్ అనుకూల పోస్టర్‌ను అతికించిన గుర్తుతెలియని వ్యక్తుల్లో ఒకరు ‘భారత్ మాతా కీ జై’ అనని ఎంపీలు, ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ‘మేం ఇలా చేశాం.. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు కూడా అదే పని చేయాలి. ఒవైసీతో సహా ‘భారత్‌ మాతాకీ జై’ అనడం మానేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని ఓ వ్యక్తి అనడం వినిపిస్తోంది.

Comments


bottom of page