ఆర్టిఫిషియల ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తోంది! పెద్ద కంపెనీల నుంచి చిన్న స్టార్టప్ల వరకు అందరూ ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ కొత్త టెక్నాలజీ ఉద్యోగులకు కొంత భయాందోళన కలిగిస్తోంది. ఏఐ రాకతో ఉద్యోగాలు కోల్పోతామనే భయం ఉంది. మరి, ఏఐతో ఉద్యోగాల భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చూద్దాం!
ఈ విషయంపై ఐబీఎం ఎగ్జిక్యూటివ్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. సీఎన్బీసీ నివేదిక ప్రకారం సుమారు 96 శాతం కంపెనీ లీడర్లు ఏఐని అందిపుచ్చుకునే పనిలో ఉన్నారు. అయితే, ఉద్యోగుల్లో మూడింట రెండు వంతులు తాము ఎప్పుడూ ఏఐతో పనిచేయలేదని అంగీకరిస్తున్నారు. ఐబీఎం గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ వర్క్ ఫోర్స్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ లిడియా లోగాన్ చెబుతున్నారు, "ఏఐ నైపుణ్యాలను నేర్చుకోకపోతే కెరీర్లో పురోగతి సాధించలేరు." రానున్న రోజుల్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్కు భారీగా డిమాండ్ ఉండనుందని ఆమె అన్నారు. ఈ నైపుణ్యం నేర్చుకోవడానికి బ్యాచిలర్ డిగ్రీ కూడా అవసరం లేదని చెబుతున్నారు.
చాట్ జీపీటీలాంటి ఏఐ టూల్స్ ఉపయోగిస్తున్నప్పుడు మీ ప్రాంప్ట్లు ఎంత కచ్చితమైనవి అయితే, ప్రతిస్పందనలు అంత మెరుగ్గా ఉంటాయని తెలిసిన విషయమే. అందుకే ప్రాంప్ట్ ఇంజనీరింగ్కు డిమాండ్ పెరుగుతోంది. ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ తన ఎంప్లాయర్ లేదా క్లయింట్లకు విలువైన సమాచారాన్ని పొందడానికి చాట్ జీపీటీ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) వంటి ఏఐ చాట్బాట్లకు సరైన ప్రశ్నలు లేదా సూచనలను రూపొందిస్తారు.
ఇక జీతాల విషయానికొస్తే, ప్రాంప్ట్ ఇంజనీర్కు భారత్లో భారీగా జీతాలు అందిస్తున్నారు. 2-5 సంవత్సరాల అనుభవం ఉంటే ఏడాదికి రూ. 6 నుంచి రూ. 12 లక్షల వరకు సంపాదించొచ్చు. 5 ఏళ్ల కంటే ఎక్కువ అనుభవం ఉంటే, ఏడాదికి రూ. 12 నుంచి రూ. 20 లక్షల వరకు ఆదాయం ఉండనుంది.