top of page
Shiva YT

నేడు ఏపీ ఇంటర్‌ హాల్‌టికెట్లు విడుదల..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల నిర్వహణకు ఇంటర్‌ బోర్డు సర్వం సిద్ధం చేసింది. ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమైన ప్రాక్టికల్స్‌ పరీక్షలు మంగళవారం (ఫిబ్రవరి 20) ముగిశాయి. దీంతో అధికారులు రాత పరీక్షలపై దృష్టి సారించారు. మార్చి 1 నుంచి 20 వరకు నిర్వహించనున్న ఇంటర్‌ వార్షిక పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షల హాల్‌టికెట్లు ఆ రోజు (ఫిబ్రవరి 21) నుంచి జారీ చేయనుంది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1,559 పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఆయా పరీక్ష కేంద్రాల్లో అన్ని గదుల్లో అధికారులు సీసీ కెమెరాలు అమర్చారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్ధుల హాజరును ఆన్‌లైన్‌ ద్వారా తీసుకోనున్నారు. అలాగే పరీక్ష పేపర్లకు క్యూఆర్‌ కోడ్‌ కూడా ఏర్పాటు చేస్తున్నారు. పేపర్‌ను ఎక్కడ ఫొటో తీసినా, స్కాన్‌ చేసినా వెంటనే వివరాలు తెలిసిపోయేలా చర్యలు తీసుకున్నారు.

పరీక్ష కేంద్రాల్లోకి ఫోన్లకు అనుమతి లేదని బోర్డు స్పష్టం చేసింది. పేపర్లను భద్రపరిచే పోలీస్‌ స్టేషన్‌లలో కూడా ఈసారి ఇంటర్‌ బోర్డు ప్రత్యేక ఏర్పాటు చేస్తోంది. అక్కడ ప్రత్యేకమైన బేసిక్‌ ఫోన్‌ను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకుంటోంది. ఈ ఫోన్‌లు కేవలం బోర్డు నుంచి పరీక్షల విభాగం అధికారులు ఇచ్చే మెసేజ్‌లను చూసేందుకే మాత్రమే ఉపయోగపడుతుంది. తిరిగి మెసేజ్‌ ఇచ్చేందుకు, ఫోన్‌ చేసేందుకు ఈ ఫోన్లలో సదుపాయం ఉండదు. అంతేకాకుండా ఈ ఫోన్‌ పరీక్ష రోజు ఉదయం 15 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది. ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి అవాంచిత చర్యలకు పాల్పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈసారి ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలకు ఇంటర్‌ బోర్డు పటిష్ట చర్యలకు ఉపక్రమించింది. ఈ ఏడాది ఫీజు చెల్లింపు నుంచి ప్రాక్టికల్స్‌ మార్కుల నమోదు వరకు అన్ని అంశాలను ఆన్‌లైన్‌లోకి మార్చింది. ప్రాక్టికల్స్‌ పూర్తయిన వెంటనే మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలకు వేగవంతమైన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇంటర్‌ బోర్డు ఈ ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఎక్కడా ఏవిధమైన పొరపాట్లు జరగకుండా ఎగ్జామినర్‌ రెండుసార్లు ఆన్‌లైన్‌లో మార్కులు నమోదు చేసేలా చర్యలు తీసుకుంది. బుధవారం విజయవాడలోని 2 సెంటర్లలో హాల్‌టికెట్ల జారీ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించాలని బోర్డు నిర్ణయించింది. కాగా 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌లకు కలిపి మొత్తం 8,13,033 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇక ఈ ఏడాది దాదాపు 10,52,221 మంది విద్యార్ధులు పరీక్ష ఫీజు చెల్లించారు. ఇందులో పస్ట్‌ ఇయర్‌లో 4,73,058 మంది, సెకండ్ ఇయర్‌లో 5,79,163 మంది విద్యార్ధులు ఉన్నారు.


bottom of page