రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లి సందడి మొదలైంది. వేడుకల్లో భాగంగా మంగళవారం పేద కుటుంబాల్లోని 50 జంటలకు సామూహిక పెళ్లిళ్లు జరిపించారు. ముంబయి సమీపంలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్ ఇందుకు వేదికైంది. దీనికి ముకేశ్ అంబానీ, నీతా అంబానీ, పెద్ద కుమారుడు ఆకాశ్, కోడలు శ్లోక, కుమార్తె ఈశా, అల్లుడు ఆనంద్ హాజరయ్యారు. అలాగే కొత్త జంటల తరఫున కొందరు బంధువులు ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. రాబోయే రోజుల్లో ఇలా మరిన్ని వివాహాలు జరిపిస్తామని ముకేశ్ కుటుంబం పేర్కొంది.
ఈ సందర్భంగా కొత్త జంటలకు భారీగా కానుకలు అందాయి. బంగారు మంగళసూత్రం, వివాహ ఉంగరాలు, ముక్కుపుడక, వెండి మెట్టెలు, పట్టీలు అందించారు. అలాగే పెళ్లి కుమార్తెకు స్త్రీ ధనం కింద రూ.1.01 లక్షల చెక్ అందించారు. అంతేగాకుండా ఒక ఏడాదికి సరిపడా సరకులు అందజేశారు. గ్యాస్ స్టవ్, మిక్సీ, ఫ్యాన్, పరుపులు, దిండ్లు, గిన్నెలు కూడా ఉన్నాయని జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. అతిథులందరికి భారీ విందు ఏర్పాటుచేశారు. నూతన దంపతులు ముకేశ్-నీతా వద్ద ఆశీర్వాదం తీసుకున్న దృశ్యాలు వైరల్గా మారాయి.
Comments