top of page
Suresh D

పుష్ప 2పై బిగ్ అప్‌డేట్ ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్

పుష్ప 2 మూవీ రిలీజ్ పై బిగ్ అప్డేట్ ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్. ఈ మూవీ రిలీజ్ వాయిదా పడనుందన్న వార్తల నేపథ్యంలో రిలీజ్ కు ఇంకా 200 రోజులు అంటూ ట్వీట్ చేసింది.

పుష్ప 2 మూవీ రిలీజ్ వాయిదా పడబోవడం లేదని మరోసారి మేకర్స్ స్పష్టం చేశారు. ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్.. సోమవారం (జనవరి 29) ఓ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేయడం విశేషం. మూవీ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలు పెడుతూ.. మరో 200 రోజుల్లో పుష్ప తన రూల్ ను మొదలు పెట్టనున్నాడని మైత్రీ మూవీ మేకర్స్ చెప్పింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

పుష్ప ది రూల్ మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ కానుందని గతేడాదే మేకర్స్ వెల్లడించారు. అయితే షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో రిలీజ్ వాయిదా తప్పదని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను ఖండిస్తూ తరచూ మేకర్స్ నుంచి సోషల్ మీడియాలో ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.పుష్ప 2 మూవీ మరో 200 రోజుల్లో రానున్నట్లు ఆ ట్వీట్ లో చెప్పారు. "పుష్ప రాజ్ తన రూల్ ప్రారంభించడానికి మరో 200 రోజులే ఉంది. పుష్ప 2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 15న ఘనంగా రిలీజ్ కాబోతోంది" అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, రష్మిక, దేవిశ్రీ ప్రసాద్ లను ట్యాగ్ చేశారు. పుష్ప కా రూల్ ఇన్ 200 డేస్ అనే హ్యాష్‌ట్యాగ్ ను కూడా మొదలుపెట్టారు.

అయితే మేకర్స్ పదే పదే రిలీజ్ డేట్ పై తగ్గేదే లేదని స్పష్టం చేస్తున్నా సందేహాలు మాత్రం వ్యక్తమవుతూనే ఉన్నాయి. రిలీజ్ కు మరో 200 రోజులే ఉన్నా.. ఇంకా 50 శాతం షూటింగ్ పెండింగ్ లోనే ఉందని, ఆలోపు అసలు పూర్తి చేయడం సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో ఈమధ్యే పుష్ప అధికారిక ఎక్స్ అకౌంట్ కూడా ఆగస్ట్ 15నే రిలీజ్ అని మరోసారి కన్ఫమ్ చేసింది.

తాజాగా మైత్రీ మూవీ మేకర్స్.. 200 రోజుల్లో పుష్ప అంటూ ఆగస్ట్ 15నే పుష్ప రూల్ మొదలవుతుందని చెబుతోంది. రిలీజ్ వాయిదాపై ఎన్ని పుకార్లు వస్తున్నా.. మేకర్స్ ఇస్తున్న హామీతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. పుష్ప మూవీ 2021, డిసెంబర్ 26న రిలీజైంది. ఇప్పటికే రెండేళ్లు దాటిపోయింది. సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో ఈ మూవీకి ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. ఈ హైప్ ను దృష్టిలో ఉంచుకొని డైరెక్టర్ సుకుమార్ సినిమాపై చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ లో మార్పులు చేయడంతోపాటు రీషూట్ల మీద రీషూట్లు చేస్తున్నారు. దీంతో అటు టైమ్, ఇటు బడ్జెట్ రెండూ పెరిగిపోతున్నాయి. అయినా ఫ్యాన్స్ నిరాశ చెందకుండా వాళ్ల అంచనాలను అందుకునేలా పుష్ప 2 తీసుకురావాలని సుకుమార్ పట్టదలతో ఉన్నాడు.

bottom of page